కరకగూడెం, ఆగస్టు 20 : రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రైతుల కలలను సాకారం చేసేందుకు ప్రాజెక్ట్లు, చెక్డ్యాంలు నిర్మిస్తున్నారని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం కరకగూడెం మండలంలోని చొప్పాల పంచాయతీ పరిధిలో గల గొడుగుబండ గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న వట్టివాగుపై 18.6 కోట్లతో చెరువు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ప్రతి చినుకును ఒడిసిపట్టి ప్రాజెక్టులకు మళ్లిస్తున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఓ విజన్తో ముందుకు సాగుతున్నదని తెలిపారు. పినపాక నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే ఏకైక కర్తవ్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగలా మారిస్తే.. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని అన్నారు. వట్టివాగుపై చెరువు నిర్మాణంతో చుట్టుపక్కల గ్రామాలైన గొడుగుబండ, చొప్పాల, తుమ్మలగూడెంలోని 900 ఎకరాలు సాగులోకి వచ్చి రెండు పంటలు పండుతాయని ఆనందం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో చెరువు నిర్మాణం పూర్తిచేసి రైతులకు కానుకగా అందిస్తామన్నారు. అలాగే చిరకాల స్వప్నం పులుసుబొంత ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని త్వరలోనే నిర్మాణం చేపట్టి మండలాన్ని సస్యశ్యామలం చేస్తానని ఉద్ఘాటించారు. రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్న ప్రభుత్వానికి ప్రజల దీవెనలు ఉండాలని రేగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, జడ్పీటీసీ కొమరం కాంతారావు, సర్పంచులు జవ్వాజీ రాధ, సుశీల, నర్సింహారావు, ఇరిగేషన్ డీఈ రమేశ్బాబు, ఏఈఈ సక్రూ, ఐటీడీఏ డీఈ రాములు, ఏఈఈ ప్రసాద్, ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రూ.6.25 కోట్ల పనులకు శంకుస్థాపన
మండలంలోని వెంకటాపురం పంచాయతీలో పాపాయిగూడెం నుంచి నిమ్మలగూడెం గ్రామానికి ఐటీడీఏ నిధులతో రూ.1.50 కోట్లతో బీటీ రహదారి నిర్మాణానికి, పాపాయిగూడెం నుంచి బుర్ధారం గ్రామానికి రూ.1.50 కోట్లతో బీటీ రహదారి నిర్మాణానికి, కరకగూడెం ఆర్అండ్బీ రహదారి నుంచి మొట్లగూడెం గ్రామానికి రూ.2.25 కోట్లతో బీటీ రహదారి నిర్మాణంతోపాటు చిరుమళ్ల పంచాయతీలో పీఆర్ నిధులతో పోలకమ్మతోగు గ్రామం నుంచి దోమొద వరకు రూ.కోటి వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్ల నిర్మాణాలకు విప్ రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో 13మందికి 13లక్షల పదిహేను వందల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, పార్టీ మండల అధ్యక్షుడు సోమయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.