భక్తకోటికి ముక్కోటి దర్శనం కలిగేలా భద్రగిరిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ఉత్తర ద్వారం ద్వారా రాములోరిని సీతమ్మవారిని తనివితీరా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం భద్రగిరిని విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. కరోనా తర్వాత తొలిసారిగా పవిత్ర గోదావరిలో హంస వాహనంలో స్వామివారిని ఊరేగించేందుకు ప్రత్యేక లాంచీ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని ముస్తాబు చేశారు. వచ్చేనెల 1న తెప్పోత్సవం, 2న ముక్కోటి దర్శనం జరుగనున్నాయి. దీంతో అధికారులు ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. కలెక్టర్ అనుదీప్ ఇప్పటికే భద్రాచలం, కొత్తగూడెం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నిశాఖల అధికారులను సమన్వయం చేస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 13 (నమస్తేతెలంగాణ) : రెండేళ్ల తర్వాత భద్రగిరి ఆలయం సందడిగా మారనున్నది. రెండేళ్లుగా ముక్కోటి ఉత్సవాలు కేవలం ఆలయం ఆవరణకే పరిమితమయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో ఎప్పటిలాగే ముక్కోటి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఉత్సవాలు ప్రారంభంకానుండటంతో ఆయా శాఖల అధికారులు ముక్కోటి పనుల్లో నిమగ్నమయ్యారు.
ఈ మేరకు డిసెంబర్ 1 నుంచే ఆన్లైన్, ఆఫ్లైన్లో దర్శనం టికెట్స్ విక్రయిస్తున్నారు. గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు సమస్యలు తలెత్తకుండా బారీక్రేడ్లు ఏర్పాటు చేసి రెండంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ సెక్టార్కు ఒక జిల్లా అధికారితోపాటు పోలీస్,రెవెన్యూ అధికారిని బృందంగా నియమించారు. ఫ్రొటోకాల్ అధికారిగా భద్రాచలం ఆర్డీవో, బందోబస్తు నిర్వహణకు పోలీస్శాఖ అధికారులను నియమించారు.
బారీగేట్ల నిర్వహణ ఆర్అండ్బీ అధికారులు, విద్యుత్ అలంకరణకు విద్యుత్శాఖ అధికారులు, హంస వాహనం ఏర్పాట్లకు ఇరిగేషన్ అధికారులను నియమించారు. నదీతీరంలో తెప్పోత్సవం రాత్రి పెద్దఎత్తున పటాకులు కాల్చేందుకు రాజమండ్రి నుంచి మెటీరియల్ను సిద్ధం చేశారు. ఇప్పటికే హంస వాహనాన్ని ముస్తాబు చేస్తున్నారు. నదిలో నీటిలోతును ధ్రువీకరించిన అనంతరం కలెక్టర్ అనుమతితో ఎంత మందిని హంస వాహనంలోకి అనుమతి ఇవ్వాలని నిర్ణయిస్తున్నారు.
పారిశుధ్య పనుల విషయంలో కలెక్టర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. గోదావరి వరదల సమయంలోనూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి క్లీన్ భద్రగిరిగా చేశారు. అదే తరహాలో జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్ పర్యవేక్షణలో భద్రాచలం,పర్ణశాల ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బంది డిప్యూట్ చేశారు. పంచాయతీ కార్యదర్శులతోపాటు శానిటేషన్ సిబ్బందిని నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పంచాయతీ సిబ్బంది ముందస్తుగా సిద్ధమైంది. తాగునీరు, పారిశుధ్య నిర్వహణకు ఇద్దరు జిల్లా అధికారులను నియమించారు.
భద్రాచలంలో 15 జోన్లుగా ఏర్పాటు చేయడంతోపాటు దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద కూడా ముక్కోటి ఉత్సవం నిర్వహించనున్నారు. దీంతో అక్కడ 4 జోన్లను ఏర్పాటు చేసి 24 గంటలు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. భక్తులకు సురక్షిత తాగునీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు పార్కింగ్ స్థలాలను ముందస్తుగా ఏర్పాటు చేశారు. 5 పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సీసీ టీవీలు, సమాచార కేంద్రాలను అందుబాటులో ఉంచుతున్నారు. భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయం, ఏఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నారు.
పర్ణశాల, డిసెంబర్ 14 : పర్ణశాల ఆలయంలో వచ్చేనెల 1వతేదీన జరిగే ముక్కోటి ఏకాదశికి ముస్తాబు అవుతున్నది. ముక్కోటి ఏకాదశి ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ అంతర్భాగంలో పందిళ్లు, తాగునీటి సౌకర్యం, ఏర్పాటు చేస్తున్నారు. పర్ణశాల క్రాస్రోడ్ వద్ద ఉన్న సిమెంట్ ఆర్చీని రంగులతో తీర్చిదిద్దుతున్నారు. ముక్కోటి సందర్భంగా పర్ణశాల పుణ్యక్షేత్రంలో ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నాయి.
పవిత్ర గోదావరినది ఒడ్డున జనవరి 1వ తేదీ సాయంత్రం హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహించేలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. ఆలయ చుట్టుపక్కల గోదావరి తీరాన పారిశుధ్య పనులు ప్రారంభించారు. పర్ణశాల పుణ్యక్షేత్రంలో జరిగే ముక్కోటి ఏకాదశి, తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కనుల పండువగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్ణశాలలో ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పులకించి పునీతులయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పార్కింగ్కు అసలు ఇబ్బంది ఉండదు. భద్రాచలంలో 5 పార్కింగ్ స్థలాలు కేటాయించాం. ప్రతీ సెక్టార్కు ఒక జిల్లా అధికారి బాధ్యులుగా ఉంటారు. నదీతీరం మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతులు ఏర్పాటు చేస్తున్నాం. సరిహద్దు రాష్ర్టాల నుంచి భక్తులు రానుండటంతో ప్రతి ఒక్కరూ దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీరామనవమిని కూడా భద్రాద్రి అధికారుల బృందంతో కలిసి చక్కగా నిర్వహించాం. విజయవంతం చేశాం. అదే తరహాలో ముక్కోటి ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తాం.
– దురిశెట్టి అనుదీప్, భద్రాద్రి కలెక్టర్