కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 30: శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సంరక్షణే ధ్యేయంగా ప్రజలతో మమేకమై పోలీస్శాఖ పనిచేస్తున్నదని భద్రాద్రి ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన వార్షిక క్రైం రిపోర్ట్ వెల్లడించారు. గడిచిన ఏడాదిలో ఏజెన్సీ మావోయిస్టుల ప్రాబల్యాన్ని పూర్తిగా రూపుమాపామన్నారు. 46 మంది మావోయిస్టు పార్టీకి చెందిన నాయకులు, సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.
వరదల సమయంలో ప్రాణనష్టం లేకుండా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించామన్నారు. ప్రజలకు అండగా నిలిచామన్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించి వ్యాధి పీడితులకు మెడిసిన్ అందజేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,174 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను కట్టడి చేస్తున్నామన్నారు. అనంతరం మావోయిస్ట్ కార్యకలాపాలను కట్టడి చేసిన ఓఏస్డీ కార్యాలయ అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏజెన్సీ ప్రాంత పోలీస్ అధికారులు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ను కట్టడి చేస్తున్న టాస్క్ఫోర్స్ బృందాలను అభినందించారు. మహిళలపై వేధింపులను నివారించేందుకు షీ టీమ్స్ క్రియాశీలకంగా పనిచేశాయన్నారు. సమావేశంలో ఓఎస్డీ టి.సాయిమనోహర్, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, భద్రాచలం ఏఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు, కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర్బాబు, డీసీఆర్బీ డీఎస్పీ బానోతు నందిరామ్, ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి, పాల్వంచ డీఎస్పీ సత్యానారాయణ, మణుగూరు డీఎస్పీ రాఘవేంద్ర రావు పాల్గొన్నారు.