భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడ దూరం. జిల్లా కార్యాలయాలన్నీ వంద కిలోమీటర్లకుపైనే. జిల్లా ఉన్నతాధికారులు, పాలకులను కలవాలన్నా.. సమస్యలు చెప్పుకోవాలన్నా రెండు రోజుల ప్రయాణం. ప్రజలపై ఆర్థిక భారం. ఎవరికి చెప్పుకున్నా గోడు వినేవారు లేరు. సమస్యను తీర్చేవారు లేరు. ఏళ్లు గడిచినా సమస్యకు పరిష్కారం లభించదనుకున్న తరుణంలో ఉద్యమ నేత కేసీఆర్ పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. సీఎం కేసీఆర్ పుణ్యమా అని కొత్త జిల్లాల ఆవిర్భావం జరిగింది. ప్రజల చెంతకు పాలన చేరువైంది. కోట్లాది రూపాయలతో కొత్త కొత్త ప్రభుత్వ కార్యాలయాలు రూపుదిద్దు కున్నాయి. ఉమ్మడి ఖమ్మం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అవతరించి నేటికి ఏడేళ్లు పూర్తయింది. రాములోరి ఇలాకా రమణీయంగా మారింది. కొత్త జిల్లా అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని పలువురు విద్యావంతులు,రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు నొక్కి చెబుతున్నారు.
గత పాలకుల హయాంలో నిరాదరణకు గురైన ప్రాంతాలను గుర్తించిన సీఎం కేసీఆర్ అభివృద్ధి బాటలు పట్టించారు. అడగకున్నా వరాలు కురిపించారు. నాడు దూరాభారంగా ఉన్న పాత జిల్లాలను కొత్త జిల్లాలుగా చేసి కొత్త పాలనకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఖమ్మంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న భద్రాద్రి జిల్లాను కొత్త జిల్లాగా చేసి నేటికి ఏడేళ్లయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఎన్నో మార్పులు చకచకా జరిగిపోయాయి. మారుమూల ప్రాంతాల ప్రజలకు పాలన చేరువ కావడంతోపాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దగ్గరయ్యాయి. అధికారులు గ్రామస్థాయికి చేరుకొని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. అభివృద్ధి అంటే ఇలా ఉంటుందని సీఎం కేసీఆర్ చేసి చూపించారు.
జిల్లా ఏర్పాటుతో మారిన రూపురేఖలు
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లా.. జిల్లా కేంద్రం రూపురేఖలను మార్చివేసింది. రాజకీయ, వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో కొత్తరూపును సంతరించుకున్నది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు కొత్త గా వచ్చిన ఉద్యోగులు, రెస్టారెంట్లు, హోల్సేల్ వ్యాపారాలు, కార్పొరేట్ వైద్యం, ప్రైవేటు విద్యాలయాలు నెలకొల్పడంతో వ్యాపార రంగం మరింత వేగంగా పెరిగిపోయింది. కిన్నెరసాని పర్యాటక ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఫారెస్టు అర్బన్ పార్క్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
కొత్తగా ఏర్పాటైన కార్యాలయాలు
నిర్మాణంలో ఉన్న కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఫారెస్టు అర్బన్ పార్క్, కిన్నెరసాని టూరిజం, బడ్జెట్ హోటల్, కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా ప్రధాన ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ, సఖి సెంటర్, జడ్పీ, జిల్లా ఎస్పీ కార్యాలయం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. సాగు, తాగునీరు సౌకర్యం మెరుగుపడేందుకు మిషన్ కాకతీయ చెరువులు, మిషన్ భగీరథ పథకం, జిల్లా మత్స్య శాఖ కార్యాలయం రావడంతో ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ ఇక్కడి నుంచే జరుగుతోంది.
కొత్తగా ఆరు మండలాలు
జిల్లా ఏర్పాటుతోపాటు కొత్తగా ఆరు మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, గుండాల, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాలు ఏర్పాటయ్యాయి. దీంతో అక్కడ కొత్త కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి.
చాలా మార్పులొచ్చాయి
తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్ ఏది చేసినా ప్రజల కోసమే చేస్తారు. గిరిజన జిల్లా ప్రజలకు అందుబాటులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. పెద్దాస్పత్రి వచ్చింది.. ఆరోగ్య సమస్యలు తీరిపోయాయి. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. కొత్త మండలాలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడి ప్రజలకు దూరాభారం తగ్గింది. ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారమయ్యాయి.
– కలకోట ఉప్పలయ్య, రిటైర్డ్ తహసీల్దార్, ఖమ్మం జిల్లా
పాలన ప్రజలకు చేరువైంది
చిన్న జిల్లాల ఆలోచన చాలా గొప్పది. పాలన ప్రజలకు చేరువైంది. ఖర్చు కూడా తగ్గింది. ప్రజావాణిలో వినతులు సమర్పించేందుకు గతంలో ఖమ్మం వెళ్లేవారు. ఇప్పుడు కొత్తగూడెం వరకు రావాల్సి ఉంటుంది. అధికారులు అందరూ ఒకే దగ్గర కలిసే అవకాశం కలిగింది. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం కావడానికి మరింత అవకాశం లభించినైట్లెంది. దీంతోపాటు కొత్త మండలాలు, పంచాయతీలను కూడా ఏర్పాటు చేశారు.
– ఎంవీ.రెడ్డి, రిటైర్డ్ కలెక్టర్
గురుకులాల్లో వసతి పెరిగింది
గురుకులాలు వచ్చాక సౌకర్యాలు బాగా పెరిగాయి. బాలికలు, బాలురుకు వేర్వేరు స్కూళ్ల నుంచి కాలేజీ వరకు బోధన, వసతి అక్కడే. ప్రభుత్వం కార్పొరేట్ను మించి సౌకర్యాలు కల్పిస్తున్నది. చూడముచ్చటగా పిల్లలకు డ్రెస్ కోడ్, ఆట వస్తువులు, స్టడీ అవర్స్, చక్కని విద్యాభోదన అందుతున్నది. సర్కారు స్కూళ్లకు విద్యార్థుల సంఖ్య పెరిగింది.
– పయ్యావుల రామమూర్తి, రిటైర్డ్ బీసీ వెల్ఫేర్ అధికారి
సరైన వాళ్ల చేతిలోకి పాలన
పరిపాలన సరైనోళ్ల చేతిలోకి వచ్చినప్పుడు అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు పెడుతున్నాయి. నిజంగా పాలన అంటే ప్రతి ఒక్కరికీ అర్థమైంది. ఇది కదా పాలన అని తెలంగాణ సర్కారు రుజువు చేసింది. కొత్త జిల్లా ఏర్పాటు వల్ల ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడ్డాయి. దూరాభారం తగ్గింది. సమస్యలను చెప్పుకోవడానికి అధికారులు దగ్గరగా వచ్చేశారు. ఇంతకంటే ఏం కావాలి.
– కే.రాజమల్లు, సింగరేణి విశ్రాంత ఉద్యోగి, కొత్తగూడెం
ప్రజలకు మేలు జరిగింది
ఇప్పుడు పల్లెలు పట్నంతో పోటీపడే స్థాయికి వచ్చేశాయి. ఇది అనుకోకుండా వచ్చిన మార్పు. అలాంటి మేధావి వర్గం పాలిస్తే దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. అందుకే కొత్త మండలాలు, కొత్త పంచాయతీలు వచ్చాయి. అప్పుడు అధికారులు కూడా పరిపాలన చేయడానికి చాలా సులువవుతుంది. మంచి పోలీస్ వ్యవస్థ వచ్చింది. స్టేషన్ అంటే భయపడే రోజులు పోయాయి.
– గుడిపూడి మోహన్రావు, విద్యావంతుడు, టేకులపల్లి మండలం