భద్రాద్రి కొత్తగూడెం, మే 2 (నమస్తే తెలంగాణ) : ఎండలు నెత్తిన నెగడులా మారాయి. భానుడి ప్రతాపంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిప్పుల కొలిమి అయ్యింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో డేంజర్ జోన్లో ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అలర్ట్గా ఉండాలని, దాటితే వార్నింగ్లో ఉన్నట్లుగా పరిగణించాలని పేర్కొంది. వారం రోజుల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బుధవారం నుంచి 45 డిగ్రీలు దాటి నమోదవుతోంది. జిల్లాలోని 14 గ్రామాల్లో 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
భద్రాచలం పట్టణంలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతోపాటు అశ్వాపురం, పాల్వంచ, చుంచుపల్లి, మణుగూరు, దుమ్ముగూడెం, దమ్మపేట, జూలూరుపాడు, చండ్రుగొండ, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం మండలాల్లో ఎండ తీవ్రతతో గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఇంట్లో ఉన్న వారు కూలర్లు, ఏసీలు పెట్టుకున్నా ఎండ తీవ్రతకు వాటి గాలి కూడా సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన నాయకులు కార్యకర్తలను ఎండలో తిప్పడంతో గంటల వ్యవధిలోనే సుడిపడి పోతున్నారు. మరోవైపు తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వస్తే ఇంటికి రాగానే వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురికావడంతోపాటు ఆస్పత్రి పాలవుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాతావరణ శాఖ ఎండ తీవ్రతను బట్టి వార్నింగ్ లెవల్స్ను చూపిస్తోంది. 45 డిగ్రీలు దాటితే వార్నింగ్ ఇస్తున్నట్లుగా ప్రకటించడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎంత తీవ్రతతో 45 డిగ్రీలు దాటి వడ గాలులు వీస్తున్నాయి. దీంతో రహదారులన్నీ నిర్మానుషంగా మారాయి. ఇక చిరు వ్యాపారుల పరిస్థితి వర్ణనాతీతం.
రోడ్ల వెంట, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు ఎండకు భయపడి పొద్దెక్కక ముందే ఇంటిముఖం పడుతున్నారు. చెట్లనీడన చెరుకు, నిమ్మరసం, పండ్లు, కొబ్బరి బొండాలు అమ్ముకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. అయినా.. ఎండలకు భయపడి జనం బయటకు రాకపోవడంతో కొనేవారు లేక బేరాలు సైతం తగ్గిపోయాయి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత రోడ్లపై కాస్త జన సంచారం కనిపిస్తోంది.
జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకునేలా వివిధ శాఖల అధికారులను అప్రమత్తం చేశాం. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలి. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. బస్సులలో ప్రయాణించే వారు తప్పనిసరిగా వాటర్ బాటిళ్లను వెంట తీసుకెళ్లాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఎండల తీవ్రత వల్ల సుస్తీగా ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యుల సలహా తీసుకోవాలి. వడదెబ్బ అనేది సైలెంట్ కిల్లర్. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యం.
– కలెక్టర్ ప్రియాంక ఆల