భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడడంతోపాటు ఇంటింటికి నీరందేలా చర్యలు చేపట్టాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ ఈఈ, డీఈలు, పబ్లిక్ హెల్త్ డీఈలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, స్పెషల్ ఆఫీసర్లతో తాగునీరు, పనుల పురోగతిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రస్తుతానికి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నదని, ఈ క్రమంలో రాబోయే మూడు నెలలపాటు గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీరు అందించాలన్నారు. నీటి వసతులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో హ్యాండ్ పంపులు, బోర్ వెల్స్, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. బోర్లు, హ్యాండ్ పంపులు, మోటర్లు, పైపు లీకేజీలను గుర్తించి త్వరితగతిన మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని నీటి సరఫరా ప్రాంతాలను విధిగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. అత్యవసరం ఉన్నచోట బోర్ వెల్స్ అద్దె ప్రతిపాదికన ఏర్పాటు చేయాలన్నారు. మండలాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ముందుగానే తాగునీటి సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ విద్యాచందన, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేశ్ పాల్గొన్నారు.