అశ్వారావుపేట, మార్చి 10: అశ్వారావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న ‘మన ఊరు – మన బడి’ పనులను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి 86 పాఠశాలల్లో 67 పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15 నాటికి అన్ని పనులనూ పూర్తి చేయాలని సూచించారు. ‘మన ఊరు – మన బడి’ పనులను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన సమీక్షించారు. పనుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. దమ్మపేట మండలంలో మరీ ఆలస్యంగా పనులు జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు రూ.5.81 కోట్లకు బిల్లులు అందగా వాటిలో రూ.5.50 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయని, ఇంత వేగంగా బిల్లులు చెల్లిస్తున్న కార్యక్రమం ‘మన బడి’ మాత్రమేనని అన్నారు. 715 బిల్లులను సమర్పించగా 683 బిల్లులు మంజూరు చేశామని, మిగతా బిల్లులు కూడా ఈజీఎస్ ద్వారా చెల్లించాల్సి ఉందని, వాటిని కూడా మరో మూడు రోజుల్లో చెల్లిస్తామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో పండుగ వాతావరణంలో విద్యార్థులు ఈ పాఠశాలలకు రావాలని, ఆ విధంగా పనులు పూర్తి చేయాలని అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఇచ్చిన ‘మన బడి’ బుక్లెట్లలో భద్రాద్రి జిల్లాలో జరుగుతున్న పనుల ఫొటోలే ఎక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో హరితహారం కింద మొక్కలు నాటారు. హరితహారంలో ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. డీఈవో సోమశేఖరశర్మ, ఏఎంవో నాగరాజు శేఖర్, అధికారులు పాల్గొన్నారు.