మెడికల్ కళాశాల.. జిల్లా వాసులు అదృష్టం..
వైద్యాన్ని ప్రజలకు చేరువచేయడం కోసం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీను మంజూరు చేయడంతో దానిన్ని ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. దీని వల్ల 380 బెడ్ల ఆసుపత్రి కూడా వచ్చిందని, తద్వారా కార్పొరేట్కు దీటైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. దీంతోపాటు ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరు ఆసుపత్రులు మరింత మెరుగయ్యాయని అన్నారు. హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల పల్లెలకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి అజయ్కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 26 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమంలో భద్రాద్రి జిల్లా అగ్రగామిగా ఉందని కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల కంటే ముందువరుసలో ఉండి దూసుకెళ్తేందని అన్నారు. కొత్తగూడెం – పాల్వంచ మధ్యలోని నూతన కలెక్టరేట్లో 74వ గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఉదయం 9:45 గంటలకు కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ కలెక్టరేట్కు చేరుకొని పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. పది గంటలకు కలెక్టర్ అనుదీప్ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడంలో యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమైనదని అన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా దానిని అమలుచేయడంలో భద్రాద్రి జిల్లా ముందువరుసలో ఉంటోందని అన్నారు. స్వచ్ఛతలో కూడా మన జిల్లాకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.
ఇటీవల వచ్చిన వరదలు, రాష్ట్రపతి పర్యటన, శ్రీరామనవమి, ముక్కోటి వేడుకలు వంటి సంక్లిష్టమైన కార్యక్రమాలన్నింటినీ జిల్లా అధికారులు విజయవంతం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం చేపట్టిన ‘ధరణి’ పోర్టల్తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. దీనివల్ల భూముల క్రయవిక్రయాలు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. కంటి వెలుగు కూడా చాలా మంచి కార్యక్రమమన్నారు. తొలి విడత ప్రజలకు ఉపయోగకరంగా ఉండడంతో ప్రజల కోరిక మేరకు రెండో విడత కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈ నెల 19 నుంచి ప్రారంభించిందన్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 25 వేల మందికి పరీక్షలు చేసి 8,869 మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం కింద జిల్లాలో 421 మంది లబ్ధిదారులకు రూ.42 కోట్ల మేర వెచ్చించి వారి జీవనోపాధికి ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. ‘మన ఊరు – మన బడి’ ద్వారా జిల్లాలోని 368 సర్కారు స్కూళ్లలో మరిన్ని సౌకార్యాలు కల్పిస్తున్నామని అన్నారు.
‘సీతారామ’తో సస్యశ్యామలం..
రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి మరింత వేగతవంతమైందని, జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని కలెక్టర్ పేర్కొన్నారు. సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి జిల్లాలోని లక్షలాది ఎకరాల బీడు భూములన్నీ సస్యశ్యామలమవుతాయని, సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు సద్వినియోగమవుతాయన్నారు. రూ.13,580 కోట్లతో సీతారామ ఎత్తపోతల పథకాన్ని, రూ.3,200 కోట్లతో సీతమ్మ సాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు చెప్పారు.
రైతుబంధు కింద రూ.203 కోట్లు..
భూమినే నమ్ముకున్న రైతన్న పంటల సాగుకు పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. దీని కింద ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున చెల్లిస్తోందని, దీంతో రైతులకు మరింత ప్రయోజనం కలుగుతోందని అన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 33,564 మంది రైతులకు రూ.203 కోట్ల మేర సాయం అందిందని వివరించారు. ఆయిల్పాం, కోకో పంటల సాగులో భద్రాద్రి జిల్లా ప్రథమస్థానంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోందని, జిల్లాలో 743 చెరువుల్లో నూరు శాతం సబ్సిడీతో 1.77 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలినట్లు వివరించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
గణతంత్ర వేడుకల వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కోయ, లంబాడీ, త్రిబుల్ ఆర్ డ్యాన్స్ వంటివి ఆహూతులను ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్లు కాపు సీతాలక్ష్మి, డీ.వెంకటేశ్వర్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన అధికారులకు, ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేశారు.