చండ్రుగొండ, జూన్ 4 : ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తిప్పనపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రామసభలు ప్రజలకు, ప్రభుత్వానికి సమస్యలు తెలియజేసే వేదికలు కావాలన్నారు. రాబోయే వానకాలం సీజన్లో పంట మార్పిడి విధానాన్ని రైతులు పాటించాలని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలన్నారు. వ్యవసాయ అధికారుల సూచన మేరకు శాస్త్రీయ పద్ధతిలో సాగు పనులు చేపట్టాలని సూచించారు.
తడి పొడి చెత్తను గ్రామాల్లో వేర్వేరుగా సేకరించాలని, గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా శాఖల సిబ్బందిని ఆదేశించారు. బడిబాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలన్నారు. కాగా, గ్రామంలోని పంట పొలాలకు వెళ్లే రహదారి ఆక్రమణకు గురైన విషయాన్ని కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో విద్యాచందన, ఎంపీడీవో అశోక్, తహసీల్దార్ జగదీశ్వరప్రసాద్, సర్పంచ్ రామారావు పాల్గొన్నారు.