భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 4 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్లో బుధవారం తొలి సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి ఆయా శాఖలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మండల అధికారులతో మాట్లాడారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ నెల 6 నుంచి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ క్లియరెన్స్, రికార్డుల నిర్వహణ, ప్రజలకు సేవలందించడంలో ప్రత్యేక చర్యలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో తడిచెత్త పొడిచెత్త వేరు చేసే కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ భవనాల శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆరోగ్యం,ఆరోగ్యకరమైన ప్రారంభాలు, వైద్యశిబిరాలు, వైద్యపరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు ‘సురక్షితంగా చేరుకోండి’ పేరిట రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 20 నుంచి 25 వరకు సంక్షేమ శాఖలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం పై అవగాహన కల్పించాలన్నారు.
27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత, నోడ్రగ్స్పై కళారూపాలు చేయాలన్నారు. మే 4 నుంచి 9 వరకు రైతులు – వ్యవసాయం తదితర అంశాలపై కార్యక్రమాలు ఉంటాయన్నారు. మే 11 నుంచి 16 వరకు, మే 18 నుంచి 23 వరకు, మే 25 నుంచి 30 వరకు, జూన్ 1 నుంచి 12 వరకు వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 99 రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై మంత్రుల సమీక్ష కూడా ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.