భద్రాచలం, జూలై 22: భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతూ పెరుగుతూ దోబూచులాడుతోంది. ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే గోదావరి వరదలతో పరీవాహక ప్రాంత గ్రామాలు, భద్రాచలంలోని పలు కాలనీలు ముంపునకు గురవుతుంటాయి. భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నం 3:20 గంటలకు గోదావరి వరద ప్రవాహం 43 అడుగులకు చేరుకోవడంతో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అదే రోజు రాత్రి 10 గంటలకు 44.60 అడుగులకు చేరుకున్న గోదావరి.. ఆ తరువాత నిలకడగానే ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు 42.7 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. అదే రోజు రాత్రి 10 గంటలకు 40.6 అడుగులకు తగ్గింది. భద్రాచలం కొత్తకాలనీలోని ఇళ్లల్లోకి వరదనీరు చేరడంతో అథికారులు వారిని హుటాహటిన నన్నపనేని మోహన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. శనివారం ఉదయం 6 గంటలకు 39.5 అడుగులకు తగ్గుముఖం పట్టడంతో అధికారులు, పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 9 గంటలకు 39.4 ఉన్న గోదావరి తరువాత కొద్దికొద్దిగా పెరుగుతూ మధ్యాహ్నం 3 గంటలకు 3 అంగుళాలు పెరిగి 39.7 అడుగులకు చేరింది. రాత్రి 8 గంటలకు మరికొద్దిగా పెరిగి 41.01 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. అయితే ఆదివారం ఉదయం కల్లా మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భద్రాచలంలోనే ఉండి వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరదల సహాయక చర్యల ప్రత్యేకాధికారులుగా ఉన్న అనుదీప్ దురిశెట్టి, కృష్ణ ఆదిత్య, ఐజీ చంద్రశేఖర్రెడ్డి, కలెక్టర్ ప్రియాంక కూడా భద్రాచలంలోనే ఉంటూ అధికారులకు సూచనలు చేస్తున్నారు.