దుమ్ముగూడెం, మార్చి 12: గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంలా నిలిచాయని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ కుమార్తెల వివాహాలను ఘనంగా జరిపించుకుంటున్నారని అన్నారు. మండలంలో 27 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంగళవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ఆడపిల్లల వివాహాలు నిరుపేద తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతటి బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఈ పథకాలు వచ్చాక ఆడపిల్లల తల్లిదండ్రులు పెద్దగా ఆర్థిక ఇబ్బందులు పడకుండా తమ కుమార్తెల వివాహాలను వైభవంగా జరిపించుకుంటున్నారని అన్నారు.
ఈ పథకాల ద్వారా రూ.1,00,116 చొప్పున అందుతున్న సాయం పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. ఈ ఘనత అంతా గత ముఖ్యమంత్రి కేసీఆర్ది మాత్రమేనని గుర్తుచేశారు. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇటీవలి భద్రాచలం పర్యటనలో భాగంగా దుమ్ముగూడెం మండలంలోని ఐదుగురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు తెల్లం సీతమ్మ, రేసు లక్ష్మి, అన్నె సత్యనారాయణమూర్తి, కణితి రాముడు, మడకం రామారావు, తోట రమేశ్, పొడియం సుబ్బారావు, కొమ్ము రంజిత్, రామిరెడ్డి, దామెర్ల శ్రీనివాస్, కెల్లా శేఖర్, తహసీల్దార్ చంద్రశేఖర్, ఆర్ఐలు ఆదినారాయణ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.