సుజాతనగర్, అక్టోబర్ 18 : వరి పంటను జిల్లాలో అధికశాతం రైతులు సాగు చేస్తున్నారు. గింజ పోసుకునే దశలో వరి పంటకు పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. దుమ్ముగూడెంలో 18,036, చర్ల మండలంలో 15,555 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సుడిదోమ, మోగి పురుగు, పాముపొడ, నల్ల కంకి లాంటి తెగుళ్లు సోకే అవకాశం ఉంది. వాటి నివారణకు వ్యవసాయశాఖ అధికారుల సూచన మేరకు మందులు పిచికారీ చేయాలని వ్యవసాయశాఖ టెక్నికల్ ఏడీఏ గుగులోత్ లాల్చంద్ పేర్కొన్నారు.
మోగి పురుగు..
మోగి పురుగు వరి పంటకు నారుమడి దశలో నుంచి కంకి పోసుకునే దశ వరకు ఆశిస్తుంది. తల్లి పురుగు ముదురు రంగులో ఉండి ముందు రెక్కలపై నల్లటి మచ్చలను కలిగి ఉంటుంది. గోధుమ రంగు వెంట్రుకలతో కలిపిన గుడ్లను గుంపులుగా నారు మడులలో పెడతాయి. నాటిన పొలంలో అయితే మొక్కల ఆకుల చివరి భాగంలో పెడతాయి. మొక్క జిలకలు దశలో పురుగు ఆశిస్తే ఎండిపోయి మొక్కల మొవ్వలు, కంకులను లాగితే అవి తేలికగా బయటకు వస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ పురుగు నారుమడిలో కొనలపై గుడ్లు పెడితే నాటు వేసే సమయంలో కొనలను తుంచివేయాలి. నాటిన తర్వాత చిరుపొట్ట దశలో పురుగును గమనిస్తే ఎకరాకు 10కిలోల కార్బోప్యూరాన్ లేదా ఎనిమిది కిలోల కరెక్ట్ హైడ్రో క్లోరైడ్ గుళికలను పంట పొలంలో వేయాలి. చిరుపొట్ట దశలో దాటాక పంట పొలాల్లో పురుగులను గమనిస్తే ఎకరాకు 500 కరెక్ట్ హైడ్రో క్లోరైడ్ పొడి మందును 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా ఎకరాకు క్లోరోపైరిపాస్ 500 మిల్లీలీటర్లు లేదా పాస్పమోరాన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు, 200 లీటర్ల కలిపి పిచికారీ చేయాలి. పురుగు తీవ్రతను బట్టి పది నుంచి 15రోజుల వ్యవధిలో మందు మారుస్తూ పిచికారీ చేయాలి. చివరిగా పంటను కోసేట ప్పుడు దుబ్బలను నేలమట్టం వరకు కోయాలి. దీనివల్ల మళ్లీ వచ్చే పంటల్లో పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
పాముపొడ తెగులు..
పాముపొడ తెగులు సోకిన వరి మొక్కలపై పొడలు పొడలుగా మచ్చలు ఏర్పడతాయి. గట్లపై ఉండే గడ్డి వల్ల ఈ తెగులు వరి పంటకు వ్యాపిస్తుంది. నత్రజనిని అధిక మోతాదులో వాడటం వల్ల కూడా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది.
నివారణ చర్యలు..
ముందుగా పొలంలో గట్లపై ఉన్న గడ్డిని కోసేసి గట్లను శుభ్రం చేయాలి. తెగులు ఉధృతిని బట్టి ఒక లీటరు నీటికి ప్రోఫికోనజోల్ ఒక మిల్లీలీటరు లేదా హెక్సక జోనల్ లేదా వాలిడా మోసిన్ రెండు మిల్లీలీటర్లు చొప్పున చేను తడిచేలా పిచికారీ చేయాలి. వరి పైరు గింజ పోసుకునే దశలో తెగులు ఉధృతి పెరిగితే గింజలు పాలు పోసుకోకుండా నల్లగా మారే అవకాశం ఉంటుంది. తక్షణమే తెగుళ్లను నివారించే చర్యలు చేపట్టాలి.
సుడిదోమ…
వరి పంటకు అధికంగా నత్రజని అందించడం వల్ల సుడిదోమ పంట పొలాల్లో వ్యాప్తి చెందుతుంది. గోధుమవర్ణం కలిగిన ఈ సుడిదోమలు వరి దుబ్బల మొదళ్లో వద్ద నీటిమట్టంపై గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తుంటాయి. దీంతో పంట సుడులు, సుడులుగా ఎండిపోతుంది. ఈ సమయంలో సుడిదోమలను వెంటనే నివారించకపోతే పంట అంతా ఎండిపోయే ప్రమాదం ఉంటుంది.
నివారణ చర్యలు..
రైతులు ప్రతినిత్యం వరి దుబ్బలు మొదలను గమనిస్తూ ఉండాలి. వరి దుబ్బుకు 20కి మించి సుడిదోమలు కనిపిస్తే ప్రతి రెండు మిల్లీలీటర్లకు 30 సెంటీమీటర్ల వెడల్పులో పాయలు తీసి గాలి వెలుతురు దుబ్బలకు తగిలేలా చూడాలి. పంటలో వెంటనే నీటిని తీసివేసి ఆరుతడి పద్ధతిలో పంటకు నీటిని అందించాలి. నత్రజని అధిక మొత్తంలో వాడకుండా తగిన మోతాదులో వాడాలి. వరి దుబ్బకు 20 నుంచి 25 దోమలు ఆశించి ఉంటే ఎకరాకు ఇమిడి క్లోఫ్రీడ్ 40 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 50 నుంచి వంద వరకు దోమలు ఆశించి ఉంటే ఎకరాకు ఒక లీటరు నీటికి 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 1.5 మిల్లీలీటర్ల ఇడోఫిన్ ఫాక్స్ మొదల దగ్గర పడేలా పిచికారీ చేయాలి. చిరుపొట్ట దశకు రాని వరి పైర్లలోసుడిదోమను గమనిస్తే ఎకరాకు 10 కిలోల కార్బోఫిరాన్ 3జీ గుళికలను వరిపైరులో చల్లుకోవాలి. వరిదుబ్బలకు 100 నుంచి 200 వరకు సుడిదోమలు ఆశిస్తే ఒక లీటరు నీటికి ఎసిఫేట్ రెండు గ్రాములు డ్రైకోఫాస్ ఒక మిల్లీలీటరు చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
నల్లకంకి తెగుళ్లు…
వరి పంటకు నల్లకంకి తెగులు సోకితే 30శాతం వరకు పంట దిగుబడి నష్టపోవాల్సి వస్తుంది. గింజ నాణ్యత కూడా తగ్గుతుంది. నల్లకంకి తెగుళ్లతో కంకి నల్లి ఆకు మట్టల్లో ఆకు మధ్య ఈ నెలలో గుంపులుగా ఉంటాయి. ఇవి చాలా సన్నగా ఉంటాయి. వీటిని సులభంగా గుర్తించలేరు. గింజ పోసుకునే దశలో గింజలను ఆశించి నష్టపరుస్తాయి. తొలి దశలోనే ముదురు గోధుమ నుంచి నల్లటి మచ్చలు ఏర్పడతాయి.
నివారణ చర్యలు..
కంకినల్లి ఆశించకుండా ఉండాలంటే కలుపు మొక్కలను పొలంలోనూ గట్ల మీద లేకుండా చూసుకోవాలి. నత్రజని ఎరువులను తగిన మోతాదులో వేసుకోవాలి. కంకి నల్లిని కంటితో గమనించలేం. కంకినల్లి లక్షణాలు ఉంటే డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు, ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 15రోజుల వ్యవధిలో రెండుసార్లు మందును మార్చి పిచికారీ చేయాలి. కంకినల్లి బాగా ఆశించే ప్రాంతాల్లో పంట కోసిన తర్వాత వరి మొదలు లేకుండా సమూలంగా నాశనం చేయాలి.
సరైన జాగ్రత్తలు పాటించాలి
జిల్లాలో 1,62,455 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం గింజ పోసుకునే దశలో చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతో మందులను పిచికారీ చేయాలి. సరైన జాగ్రత్తలు పాటిస్తేనే పంట దిగుబడి వస్తుంది.
– లాల్చంద్, ఏడీఏ టెక్నికల్