భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల వైద్యులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్ర ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పలు వార్డులను పరిశీలించారు. తొలుత ఎమర్జెన్సీ వార్డును సందర్శించి వైద్యసేవలు సరిగ్గా అందుతున్నాయా.. మందులు ఇస్తున్నారా.. ఎన్నిరోజుల నుంచి ఆస్పత్రిలో ఉన్నారు.. తదితర వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులో రోగులను డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఆర్ధోపెడిక్, ఇంటెన్సివ్ కేర్ను సందర్శించి అక్కడ రోగుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెడికల్ స్టోర్, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. బయోమెట్రిక్ హాజరు రికార్డులను పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూరుశాతం హాజరు ఉండాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆస్పత్రి అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయో సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రి వెలుపల డ్రైనేజీ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలను సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర్లును ఆదేశించారు. వారంరోజుల్లో ఆస్పత్రిలో ఉన్న పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆస్పత్రి ఏవోను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో శిరీష, ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ లక్ష్మణ్రావు, ఆర్ఎంవో జీజీహెచ్ డాక్టర్ పుష్పలత, ఆర్ఎంవో ఎంసీహెచ్ రామవరం డాక్టర్ వీరబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేంద్ర, ఆస్పత్రి అన్ని విభాగాల మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి వైద్యులపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. గంటసేపు వార్డులను పరిశీలించిన ఆమె రెండుగంటలపాటు అన్ని విభాగాల వైద్యులతో సమీక్ష నిర్వహించారు. పనితీరు మార్చుకోవాలని వైద్యులను హెచ్చరించారు. ఆసుపత్రి నిర్వహణ బాగా లేదని, అన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని ఆసుపత్రి ఏవో విజయభాస్కర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ దూడల బుచ్చయ్య ఆసుపత్రి అపరిశుభ్రతపై కలెక్టర్కు ఫిర్యాదు చేయగా వెంటనే ఆమె స్పందిస్తూ వారంరోజుల్లో సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. రామవరం మాతా శిశుకేంద్రంలో తల్లీబిడ్డ మృతిపై నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మళ్లీ వారంరోజుల్లో ఆసుపత్రికి వస్తానని మార్పు లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 11 గంటలకు వచ్చిన ఆమె 2 గంటల వరకు ఆసుపత్రిలోనే సమీక్ష చేసి వైద్యుల పనితీరు పరిశీలించారు.