భద్రాచలం, ఏప్రిల్ 19 : బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాచలం సీతారామచంద్రస్వామివారి ఆలయంలోని బేడా మండపం వద్ద రామయ్య తండ్రికి వేద మంత్రోచ్ఛారణల మధ్య మహదాశీర్వచనం కార్యక్రమాన్ని వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణం తర్వాత కల్యాణ రాముడికి వేదపండితులు ఆశీర్వచనం ఇస్తారు. స్వామివారి కల్యాణంలో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలగాలని కోరుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సదస్యం కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగు రాష్ర్టాల నుంచి చతుర్వేద పండితులు, ద్రవిడ దివ్య ప్రబంధ పారాయణదారులు హాజరై రామయ్య తండ్రికి వేదాశీర్వచనం చేయడం ఆనవాయితీ. స్వామివారి కల్యాణ మూర్తులను బేడా మండపం వద్దకు తీసుకొచ్చి వివిధ రకాల పుష్పాలు, ఫలాలతోప్రత్యేక పూజలు చేశారు. రాత్రికి స్వామివారికి తిరువీధి సేవ జరిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, ఉప ప్రధానార్చకులు కోటి
శ్రీమన్నారాయణాచార్యులు పాల్గొన్నారు.