భద్రాచలం/సారపాక, జూలై 22: ‘గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు.. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.. ప్రస్తుతానికి వరద తగ్గితే పూర్తిగా ముప్పు తప్పినట్లు కాదు.. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.. ఎగువన కురిసే వర్షాలకు మళ్లీ ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నది.. యంత్రాంగం సమర్థంగా పనిచేసి వరద విపత్తును ఎదుర్కోవాలి..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సారపాక ఐటీసీ గెస్ట్హౌస్లో శనివారం ఎంపీ మాలోత్ కవితతో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, కేటీపీఎస్, నవభారత్ కర్మాగారాల రెస్క్యూ టీంలను రంగంలోకి దించామని, ప్రజలెవరూ అధైర్యపడొద్దని.. సర్కార్ అండగా నిలుస్తుందని అన్నారు.
గోదావరి వరదల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. భద్రాచలానికి వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని, మరో మూడు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నందున వరద భయం పొంచి ఉందని అన్నారు. గోదావరి వరదల నేపథ్యంలో సారపాకలోని ఐటీసీ గెస్ట్హౌస్లో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతో కలిసి ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులతో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. వరదలు సాధారణ స్థాయికి వచ్చేంత వరకు తాను భద్రాచలంలోనే ఉంటానని అన్నారు. వరద పరిస్థితిని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని, ఎంత వరద ముప్పు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించామని, సింగరేణి, కేటీపీఎస్, నవభారత్ రెస్క్యూ టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ము ఖ్యంగా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సీజనల్ వ్యాధు లు ప్రబలే ప్రమాదం ఉందని అక్కడ నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు.
అలాగే వైద్యారోగ్య శాఖాధికారులు కూడా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎవరికైనా అనారోగ్యం కలిగితే వెంటనే వైద్య చికిత్స అందించాలని సూచించారు. పునరావాస కేం ద్రాల్లో కూడా అత్యవసర మందులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అనంతరం ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. వరద ఉధృతి గతంలో కంటే తక్కువగానే ఉన్నప్పటికీ అధికారులు అలసత్వం వహించవద్దని సూచించారు. ఏమాత్రం వరద పెరిగినా ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు తదితర అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో మంచి రుచికరమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ప్రత్యేకాధికారులు అనుదీప్ దురిశెట్టి, గౌతమ్ పొట్రు, భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఎస్పీ వినీత్ పాల్గొన్నారు.
దివ్యాంగుల పింఛన్ పెంపు ఉత్తర్వుల జారీ పట్ల మంత్రి పువ్వాడ హర్షం
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ల పథకం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆసరా పథకం ద్వారా దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3016కు మరో రూ.వెయ్యి పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రూ.వెయ్యి పింఛన్ పెంచడం సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంగా పింఛన్ ఇస్తున్న ప్రభుత్వాలు లేవని స్పష్టం చేశారు. దివ్యాంగులకు పింఛన్ పెంచుతున్నట్లు మంచిర్యాల సభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు.