భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సబ్ మార్కెట్లలో పత్తి విక్రయాలు జోరందుకున్నాయి. మద్దతు ధర ఉన్నా సీసీఐ కేంద్రాల వద్ద పత్తి విక్రయాలకు రైతులు క్యూ కడుతుండడంతో అధికారులు పలు నిబంధనలు విధిస్తున్నారు. దీంతో రైతులు చేసేది లేక ప్రైవేటు కొనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్ముతున్నారు. తెల్లవారకముందే సరుకును తీసుకొని కొనుగోలు కేంద్రాలకు వెళ్లినా సాయంత్రం వరకు క్యూలోనే ఉండాల్సి వస్తున్నదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేసినా విక్రయాలకు పడిగాపులు కాయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట విక్రయించడం చాలా సులువు కావడంతో రైతులు సబ్ మార్కెట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలోని నాలుగు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 1,73,980 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా.. సబ్ మార్కెట్లో 86,500 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. జూలూరుపాడు మండలంలోని సబ్ మార్కెట్లో కూడా పత్తి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
సబ్ మార్కెట్లలో పత్తి విక్రయాలకు ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఇబ్బంది లేకుండా తమ సరుకును విక్రయిస్తున్నారు. పత్తి లోడు వచ్చిందంటే చాలు ట్రేడర్ వాహనం దగ్గరకే వచ్చి కాంటా వేసి వెంటనే సొమ్ము చెల్లించడంతో రైతులు చకచకా విక్రయాలు చేస్తున్నారు. దీంతో బయట విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎలాంటి ఆధార్ కార్డు, కూపన్ లేకుండానే విక్రయాలు జరుగుతుండడంతో రైతులు ఇబ్బందులు లేకుండా అమ్ముకుంటున్నారు.
ప్రభుత్వం అంటే సీసీఐ క్వింటా రూ.7,020 ధర వరకు ఉంది. బయట రూ.6,500 చొప్పున కొంటున్నారు. సీసీఐలో క్వాలిటీ పత్తిని మాత్రమే తీసుకుంటారు. ఎక్కువ మంది రైతులు రావడం వల్ల ఆలస్యంగా కావడం సహజమే. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విక్రయాలు చేపడుతున్నాం. సరుకు కొనుగోళ్లపై మార్కెటింగ్ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. చెక్ పోస్టుల వద్ద కూడా నిఘా పెంచాం.