సత్తుపల్లి టౌన్, డిసెంబర్ 16: సత్తుపల్లి పట్టణంలోని రెవెన్యూ గెస్ట్హౌస్లోని ఖాళీ స్థలంలో హెటిరో డ్రగ్స్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి రూ.2 కోట్ల సొంత నిధులతో నిర్మించిన గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి గ్రంథాలయ సంస్థకు అప్పగించనున్నారు. నాటి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి మేరకు రాజ్యసభ సభ్యుడు వెంటనే స్పందించి లైబ్రరీ నిర్మాణానికి ముందుకు వచ్చారు.
కలెక్టర్ వీపీ గౌతమ్ కూడా పట్టణంలో నిరుపయోగంగా ఉన్న రెవెన్యూ గెస్ట్హౌస్ ఆవరణలో 12 కుంటల భూమిని లైబ్రరీకి కేటాయించారు. దీంతో పనులు చకచకా ప్రారంభమై ఇటీవల పూర్తయ్యాయి. వైట్ హౌస్ మోడల్లో ప్రస్తుతం రెండు అంతస్తుల గ్రంథాలయ భవనం అందుబాటులోకి వచ్చింది. లైబ్రరీ ప్రారంభమైతే ఇక విద్యార్థులు ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి చదువుకునేందుకు వీలు కలుగుతుంది. లైబ్రరీలో రెండు డిజిటల్ లైబ్రరీలు, విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా ఫర్నీచర్ అందుబాటులో ఉంటాయి.