జూలూరుపాడు, జూలై 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని జూలూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పాపకొల్లు ఆర్ & బి రోడ్డుకు ఇరువైపులా శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, గ్రామస్థులు కలిసి ఏవిన్యూ మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణ, హరిత వాతావరణ విస్తరణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతి సంపదను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. రహదారుల వెంట మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ తాళ్లూరు రవి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని బతికించే దిశగా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. పచ్చదనం పెరిగితేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రామారావు, ఈసీ సైదులు, టీఏ నాగమణి, ఉపాధి హామీ పథకం సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.