బూర్గంపహాడ్, మార్చి 20 : బూర్గంపహాడ్ మండలంలోని సారపాక పంచాయతీ పరిధి శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గుంపులో ఐసీడీఎస్ సీడీపీఓ రేవతి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్టీ కాలనీ గుంపులో చిన్నారుల ఆరోగ్య పరిస్థితులు, వారికి అందుతున్న సౌకర్యాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శ్రీరాంపురం కాలనీలో అంగన్వాడీ సెంటర్ ఉండగా ఎస్టీ కాలనీ
గుంపులో సెంటర్ లేకపోవడంతో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలంటే రెండు కిలోమీటర్ల వ్యత్యాసం
ఉండడంతో అంగన్వాడీ సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నారు. ఈ సమస్య తెలుసుకున్న సీడీపీఓ సూపర్వైజర్ సక్కుబాయితో
కలిసి గుంపులో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని టేక్ హోం రేషన్ పంపిణీ చేశారు.
అంతేకాకుండా ఇప్పటికే ఇక్కడ నూతనంగా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే రెండుసార్లు ప్రతిపాదనలు ఇటు ఐటీడీఏ పీఓ, అటు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ఎస్టీ కాలనీ గుంపు పరిధిలో మొత్తం 65 కుటుంబాలు ఉండగా 265 మంది జనాభా ఉన్నారని, గర్భిణులు, బాలింతలు నలుగురు, మూడు నుండి ఆరేళ్ల పిల్లలు 15 మంది ఉన్నట్లు చెప్పారు. ఎస్టీ కాలనీలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందిన సౌకర్యాలను ఎస్టీ కాలనీ గుంపులో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సీడీపీఓ తెలిపారు. త్వరలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో వారికి సేవలు అందేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సులోచన, గర్భిణులు, బాలింతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.