పాల్వంచ, మే 12 : పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు బాధ పడవద్దని, ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ సాధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి అన్నారు. పాల్వంచలోని బొల్లూరుగూడెం ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని (రెమెడియల్ క్యాంప్) మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాల్వంచ పట్టణ, మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 109 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలో ఫెయిల్ అయ్యారని, వారికోసం ప్రభుత్వం 12వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు (రెమెడియల్ క్యాంపు) ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆయా సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థులు క్రమం తప్పకుండా శిక్షణ తరగతులకు హాజరై ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని తిరిగి మళ్లీ పరీక్షలు రాసి పాసై రెగ్యులర్ విద్యార్థులు మాదిరిగా తిరిగి ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు. ఫెయిల్ అయ్యామని బాధపడుతూ ఇంట్లోనే కూర్చొకుండా ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు అంతా కూడా పేద తరగతికి చెందినవారు అయినందువల్ల తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేయకుండా ఉన్నత శిఖరాలకు ఎదిగేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఏ.శ్రీరామ్మూర్తి, నోడల్ అధికారి బి.ప్రకాశరావు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు సునందిని, కుమారి, మంగమ్మ, పద్మలత, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

వైఫల్యం నుండే విజయం మొదలు : డీఈఓ బి.నాగలక్ష్మి