బూర్గంపహాడ్, జూలై 21 : బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఐటీసీ యాజమాన్యం సీఎస్ఆర్ నిధులు రూ.49.75 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతలో డొల్లతనం కనిపిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ రోడ్డు పూర్తిచేసి పట్టుమని నాలుగు నెలలు గడవకముందే బీటలు వారడంతో సీఎస్ఆర్ నిధులు గోదావరి పాలైనట్లేనా అని అంతా చర్చించుకుంటున్నారు. స్మశానవాటికకు వెళ్లే మార్గంలో చిన్న వంతెనతో పాటు నిర్మించిన ఈ రోడ్డుపై ఇప్పటివరకు భారీ లోడు వాహనాలు తిరగలేదు. గొర్రెల మంద, అప్పుడప్పుడు ఒక ట్రాక్టర్ మాత్రమే ప్రయాణించినప్పటికీ పలుచోట్ల రోడ్డు చీలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. చిన్నపాటి వర్షాలకే రోడ్డు ఈ పరిస్థితికి చేరితే గోదావరి వరదల సమయంలో వారం రోజుల పాటు ముంపు ఏర్పడితే రహదారి దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు పక్కన మట్టి నింపకపోవడం, రక్షణ గోడలు నిర్మించకపోవడంతో రోడ్డు అంచులు, కల్వర్టు భాగాల్లో పగుళ్లు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్కు ఐటీసీ యాజమాన్యం రూ.1.70 లక్షల విలువైన కల్యాణ మండపం నిర్మాణ పనులు కూడా అప్పగించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఆ నిర్మాణ పనులు కూడా నాణ్యత లేకుండా ఉంటే ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఐటీసీ యాజమాన్యంతో పాటు సర్పంచ్, పాలకవర్గ సభ్యులు తక్షణమే స్పందించి నాణ్యత లోపంగా పనులు చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణ పనులపై విచారణ చేసి లోపాలు సరిదిద్దడంతో పాటు పునఃనిర్మాణ చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.