– కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరిక
బూర్గంపహాడ్, ఏప్రిల్ 10 : కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐటీసీ యాజమాన్యం పరిష్కరించేందుకు కార్మిక సంఘాల నాయకులను చర్చలకు పిలవకపోతే ఏ క్షణమైనా సమ్మెబాట తప్పదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్పాషా హెచ్చరించారు. శుక్రవారం 16వ రోజుకు చేరిన దీక్షా శిబిరంలో కందాల వెంకటరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, రూప కల్యాణ్, వల్లోజి కమల, వర్కా సుజాత పాల్గొనగా ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా(టీయూసీఐ) జిల్లా అధ్యక్షుడు ఆర్.మధుసూదన్రెడ్డి, ప్రజాపంథా భద్రాచలం డివిజన్ కమిటీ సభ్యుడు సాయిబాబులు దీక్షా శిబిరం వద్దకు వచ్చి కాంట్రాక్టు కార్మికులకు మద్దతు పలికి వారి న్యాయమైన కోర్కెలు యాజమాన్యం తీర్చాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ.. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఐటీసీపై ఉందని, రిలే దీక్షలు చేపట్టి 16 రోజులైనా ఐటీసీ యాజమాన్యం కార్మికులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా కార్మిక సంఘ నాయకులను చర్చలకు పిలిచి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో ఎప్పుడైనా… ఏ క్షణమైనా సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు ఆకిని సర్వేశ్వరరావు, మర్రి వెంకటరెడ్డి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, బాబు, ప్లాంటేషన్ మహిళా కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.