రుద్రంపూర్, జూలై 09 : రామవరంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతుల నాణ్యతను ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. రికార్డుల పరిశీలన, సేవలపై ఆరా తీసింది. హైదరాబాద్లోని రీజినల్ ఆఫీస్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ వరుణ్ విజయ్ గైకి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. గర్భిణీలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఏఎంసి రిజిస్ట్రేషన్లు, ఈడీడీ రిజిస్టర్లను చెక్ చేసి, ఇప్పటివరకు జరిగిన ప్రసవాల గణాంకాలను అంచనా వేశారు. టీబీ (క్షయ), లెప్రసీ (కుష్టు) వ్యాధిగ్రస్తుల వివరాలను, వారికి అందిస్తున్న ఉచిత మందుల పంపిణీ తీరును సమీక్షించారు. రోగులకు రక్తపోటు (బి.పి) పరీక్షించే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ, బయో మెడికల్ వ్యర్థాల సురక్షిత డిస్పోజల్ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేద ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని డాక్టర్ వరుణ్ విజయ్ గైకి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని ఆదేశించారు. ఈ ఉన్నతాధికారుల బృందంలో క్వాలిటీ మేనేజర్ శృతి, హెల్త్ ఎడ్యుకేటర్ రాంప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ సలిత ఉన్నారు. అలాగే ఈ తనిఖీ కార్యక్రమంలో రామవరం హెల్త్ సెంటర్ నర్సింగ్ ఆఫీసర్ శంకరమ్మ, పీహెచ్ఎం శ్రీనివాసరావు, ల్యాబ్ టెక్నీషియన్ స్పందన, డీఈఓ స్ఫూర్తి, ఏఎన్ఎంలు రాజేశ్వరి, శ్రీలక్ష్మి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

‘రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా పని చేయాలి’