భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో కార్తీక శ్రీరామ పునర్వసు దీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. భద్రుని మండపంలో దీక్షా ధారణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్ నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాఃవాచన, శ్రీరామ అష్టోత్తర శతనామార్చన జరిపారు. శ్రీరామ పునర్వసు దీక్షను స్వీకరించేందుకు వచ్చిన భక్తులు తమ వెంట తీసుకు వచ్చిన తులసి మాలలను భద్రుని శిరస్సుపై ఉంచి మంత్రోచ్ఛరణల నడుమ దీక్షపరుల మెడలో ధరింపజేశారు.
అనంతరం పునర్వసు దీక్షను స్వీకరించిన మాలధారులు జై శ్రీరామ్, జైజై శ్రీరామ్ అంటూ జయజయధ్వానాల నడుమ ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ నిర్వహించి, నగర ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.