– హెచ్ఎం బివిఎల్ కుమార్
రుద్రంపూర్, మార్చి 11 : విద్యార్థుల భవిష్యత్కు తోడ్పడే ప్రతి చిన్న సహాయం సమాజ అభివృద్ధికి పెద్ద అడుగుగా మారుతుందని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ భాషిద్ అన్నారు. బుధవారం మేదర్ బస్తీ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సందర్భంలో అవసరమైన ప్యాడ్లు, స్కేల్స్, పండ్లను జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం బోగ ప్రసాద్ సౌజన్యంతో నిర్వహించబడింది. మున్సిపల్ కార్పొరేషన్ 53వ వార్డు పరిధిలోని మేదర్ బస్తీ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బివిఎల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తున్న బోగ ప్రసాద్, షేఖ్ అబ్దుల్ బాసిత్కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించి తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.
మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. దేవుడు ఇచ్చిన దాంట్లో పేదవారి హక్కు కూడా ఉందని, ముఖ్యంగా విద్యార్థుల చదువుకు సహాయం చేయడం ద్వారా కలిగే ఆత్మ సంతృప్తి అపారమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి స్కూల్కు, మేదర్ బస్తీ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కౌన్సిలర్ బండి నరసింహ రావు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వీరబాబు, శ్రీనివాస్ రావు, నాగేశ్వరరావు, విమలతో పాటు జమాతే ఇస్లామి కొత్తగూడెం అధ్యక్షుడు ఫారూఖ్ యజ్దాని, రియాజ్ బేగ్ పాల్గొన్నారు.

‘విద్యార్థులకు ఏ చిన్న సాయమైన సమాజ అభివృద్ధికి పెద్ద అడుగు’