చుంచుపల్లి, జూన్ 03 : రుద్రంపూర్ మార్కెట్ ఏరియాలో ఎన్నో ఏళ్లుగా ఉన్న భారీ రావిచెట్టు బుధవారం తెల్లవారుజామున వచ్చిన గాలి దుమారానికి కొమ్మ విరిగి విద్యుత్ తీగలపై, అలాగే సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ షెడ్లపై పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో పలు విద్యుత్ స్తంభాలు కూడా దెబ్బతినడంతో ఉదయం 4 గంటల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అంతరాయంతో రుద్రంపూర్ మార్కెట్ ప్రాంతంతో పాటు పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండలు మండిపోతున్న వేళ ఫ్యాన్లు, కూలర్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మరోవైపు మార్కెట్ ఏరియాలోని వ్యాపార సముదాయాలకు విద్యుత్ లేకపోవడంతో పలువురు వ్యాపారులు తమ దుకాణాలను మూసివేయాల్సి వచ్చింది.
సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు చేపట్టి విరిగిపోయిన కొమ్మలను తొలగించారు. దెబ్బతిన్న విద్యుత్ తీగలు, స్తంభాల మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ఏఈ లక్ష్మీ నరసింహారావు, లైన్మెన్ కిషన్, సాంబశివరావు పంచాయతీ సిబ్బంది శ్రమించారు. భారీ చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లకు ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టి చెట్ల కొమ్మలను కత్తిరించాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.