భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 20 : అంగన్వాడీ కేంద్రాల్లో ఆన్లైన్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డులో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ప్రతి అంగన్వాడీ టీచర్ ఆయా కేంద్రాల్లో సేవలను కచ్చితంగా ఆన్లైన్ చేసి పై అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహారం, తల్లులకు రేషన్ సరుకులు సక్రమంగా ఇచ్చేందుకే ఈ ఆన్లైన్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. కొన్ని యాప్లు అమల్లోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వమే టీచర్లకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం జరిగిందని ప్రతి ఏరియాలో నెట్ సౌకర్యం ఉన్నందున ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు.
ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, సమస్యలకు పరిష్కారం చేస్తానన్నారు. మారుమూల గ్రామాల్లో ఇంకా అంగన్వాడీ కేంద్రాలు స్థల సమస్య వల్ల కొలిక్కి రాలేదని వాటిని కూడా త్వరగా పరిష్కారం చేసి అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సిడిపిఓ లను ఆదేశించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి సెక్టార్ కొత్తగూడెం ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ కొత్తగూడెం సిడిపివో, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.