ఖమ్మం లీగల్, అక్టోబర్ 11 : జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చట్టాన్ని పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మంగళవారం న్యాయమూర్తి స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం గురించి అవగాహన కల్పించారు.
చట్టాన్ని అందరూ గౌరవించాలని, వైద్యులు చట్టాన్ని ఉల్లంఘించి దోషులుగా నిలబడవద్దన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. తాత్కాలిక స్వలాభం కోసం స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, వైద్యులు సమాజంలో ఆడ,మగ నిష్పత్తిని భంగం చేయవద్దన్నారు. సీపీ విష్ణు వారియర్ మాట్లాడుతూ.. చట్టాలను కఠినంగా అమలు చేయడానికి జిలా యంత్రాంగం సిద్ధంగా ఉన్నదని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే వదిలిపెట్టమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రామారావు, జిలా వైద్యాధికారి బి.మాలతి, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.