టేకులపల్లి: రైతు బీమా పథకంలో స్వల్ప మార్పులతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని మండల వ్యవసాయశాఖ అధికారి అన్నపూర్ణ అన్నారు. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రం వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది రైతు బీమా పథకానికి అర్హత కలిగిన రైతులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులు అదే రోజు బీమా పోర్టల్లో ఆ క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ద్వారా నమోదు చేయించాలని, రైతు చనిపోయిన సమాచారం కుటుంబ సభ్యుల ద్వారా వెంటనే ఏఈఓకు, మండల వ్యవసాయ అధికారికి తెలియజేయాలన్నారు.
అలాగే 2021 అక్టోబర్5వ తేదీ తర్వాత చనిపోయిన రైతులు 7రోజుల్లోపు వారు సంబంధిత పత్రాలు ఆ రైతు క్లస్టర్లో ఉన్న ఏఈవోలకు సమర్పించాలని సూచించారు. 2020ఆగస్టు15 నుంచి2021 అక్టోబర్5వ తేదీ మధ్యలో రైతు చనిపోయి, ఇంత వరకు ఆ సమాచారం సంబంధిత ఏఈఓకు తెలియపరచని వారు ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు.
రైతులు ముఖ్యంగా 50నుంచి59 సంవత్సరాల మధ్య గల వారు తమ ఆధార్కార్డులో జన్మించిన తేదీ లేదా సంవత్సరం లేదా ఇతర సమాచారంలో మార్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోవాలి అని లేకపోతే రైతు బీమా పథకం అమలులో ఇబ్బందులు వస్తాయని, రైతులు తమ అడ్రస్ ప్రూఫ్లలో మార్పులు ఉంటే వెంటనే మార్చుకోవాలి అని సూచించారు.