రుద్రంపూర్, మార్చి 06 : ”మతాలు మనుషులను వేరు చేయవు.. మనసులు కలిసినప్పుడు సమాజం ఒక్కటిగా నిలుస్తుంది” అనే సందేశాన్ని ఇఫ్తార్ కార్యక్రమం మరోసారి చాటి చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీకి చెందిన సందిరి గోపాల్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. మత సామరస్యానికి, మానవతా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా గోపాల్ను గ్రామస్తులు స్మరించుకుంటారు. మొహర్రం మాసంలో నిర్వహించే పీరీల కార్యక్రమాల్లో ఆయన భక్తిశ్రద్ధలతో పాల్గొనడమే కాకుండా వాటి నిర్వహణలో కూడా ముందుండేవాడు. తండ్రి చూపిన అదే మానవత మార్గాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు సందిరి కిరణ్ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా రుద్రంపూర్ మసీదు వద్ద ముస్లిం సోదరుల కోసం శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశాడు. ఉపవాస విరామ సమయంలో ముస్లింలు ప్రార్థనల అనంతరం ఇఫ్తార్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు అబ్దుల్ భాషిద్, మసీద్ మౌలానా మజార్, సోను భాయ్, షమీం, కరీం, షాకీర్, సమీర్, ఫారుక్, ఉమర్, మునవర్, అజార్, సాయిరామ్, శంకర్, శ్రీనివాస్, కొండరాజు, మైల కృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.