బూర్గంపహాడ్, ఏప్రిల్ 18 : కార్మిక సమస్యలు తక్షణం పరిష్కరించాలని కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఐటీసీ కర్మాగారం అడ్మిన్ బ్లాక్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించడం లేదని, 14వ వేతన ఒప్పందం కార్మికులకు ఆమోదయోగ్యంగా రూ.22 వేలకు తగ్గకుండా చేయాలని, కార్మికులందరికీ 100శాతం అన్లిమిటెడ్ మెడికల్ స్కీంను తీసుకు రావాలని డిమాండ్ చేశారు. అడ్మిన్ బ్లాక్లో కార్మికులంతా నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు.
జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికులకు కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని, షటిల్ కోర్టు, జిమ్ ఏసీ, బైక్ స్టాండ్, లాంగ్ సిక్ కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు తదితర సమస్యలు ఐటీసీ యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో కార్మిక జేఏసీ తీసుకునే వ్యతిరేక నిర్ణయాలకు గుర్తింపు సంఘం, యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.