పాల్వంచ: పాత పాల్వంచలో రాష్ట్రస్థాయిలో వారం రోజుల పాటు బొందిలి హరి మెమోరియల్ ట్రస్టు క్రికెట్ కప్ (సీజన్-1) టోర్నమెంట్ పోటీలు జరిగాయి. ఈ పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పాల్వంచ జట్టుకు, ద్వితీయస్థానంలో నిలిచిన మణుగూరు జట్టుకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విన్నర్ జట్టుకు రూ.30 వేల నగదుతో పాటు ట్రోఫీని, రన్నర్ జట్టుకు రూ.15 వేలు నగదుతో పాటు ట్రోఫీని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బొందిలి హరి మెమోరియల్ క్రికెట్ పోటీలను రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పాత పాల్వంచ యువతను, సహకరించిన ప్రతీ ఒక్కరినీ ఆయన అభినందించారు. తనవంతు తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని, ఇదే రీతిలో పోటీలను కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మెదరమెట్ల వెంకటేశ్వర్లు, ముత్యాల రమణమూర్తి, పెద్దమ్మతల్లి ఆలయ ధర్మకర్త చింతా నాగరాజు, ఎండీ ఫరీద్, టి.నాగసత్యం, మణికంఠ, సంతోష్, సాయి కిరణ్, కొంగ సందీప్, రాజేష్, నాగరాజు, విన్ను తదితరులు పాల్గొన్నారు.