రుద్రంపూర్, జూలై 06 : కొత్తగూడెం ఏరియాలో భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులతోనే సర్ఫస్ కన్వర్షన్ చేపట్టి, ఏరియాలో ఖాళీగా ఉన్న సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ పోస్టులను భర్తీ చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యంపై నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ మాట్లాడుతూ.. ఈ సమస్యను ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి భూగర్భ గని కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఏఐటీయూసీ ఒత్తిడి ఫలితంగా ఈ నెల 8వ తేదీన నిర్వహించాల్సిన సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ వెబ్ కౌన్సిలింగ్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం గుర్తింపు సంఘం ఏఐటీయూసీకి తెలిపిందన్నారు.
అండర్ గ్రౌండ్ కార్మికుల సర్ఫస్ కన్వర్షన్ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, మణుగూరు సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ తో సంబంధం లేకుండా ముఖ్యంగా పీవీకే-5 భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్న అర్హులైన కార్మికులకే తొలి ప్రాధాన్యత కల్పించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. అదేవిధంగా సర్ఫస్ కన్వర్షన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బేరర్ హుమాయూన్, నాయకులు లక్ష్మీనారాయణ, సోమయ్య పాల్గొన్నారు.