రఘునాథపాలెం, అక్టోబర్ 11: పోడు భూముల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం మండలంలోని పంగిడి గ్రామంలో జరుగుతున్న పోడు భూముల సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే ప్రదేశానికి వాహనం వెళ్లే అవకాశం లేకపోవడంతో కలెక్టర్ స్వయంగా బైక్ నడుపుతూ సర్వే ప్రదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భూక్యా ప్రసాద్ అనే రైతుకు చెందిన భూమి సర్వేను కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోడు చేస్తున్న భూమిని కాకుండా కొత్తగా అటవీ భూమి ఆక్రమణ చేపట్టవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 94 పంచాయతీలకు సంబంధించి 132 ఆవాసాల్లో 42,409.04 ఎకరాలకు 18,295 దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో విచారణ జరుగుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నెలాఖరుకల్లా సర్వే పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఎఫ్డీవో ప్రకాశ్రావు, ప్రత్యేకాధికారి సత్యనారాయణ, ఎఫ్ఆర్వో రాధిక, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ మంగీలాల్, అధికారులు పాల్గొన్నారు.