– సీఎఫ్ఎల్–సీఎస్పీలు సమన్వయంతో ముందుకెళ్లాలి
– కొత్తగూడెం రీజనల్ మేనేజర్ పిజిఎన్ శర్మ
కొత్తగూడెం, జూలై 21 : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ (CFL) ఆధ్వర్యంలో కొత్తగూడెం ఆర్బీఓ పరిధిలోని సీఎఫ్ఎల్ ప్రతినిధులు, సీఎస్పీలతో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం రీజినల్ మేనేజర్ పిజిఎన్ శర్మ మాట్లాడుతూ.. సీఎఫ్ఎల్లు, సీఎస్పీలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడంతో పాటు బ్యాంకింగ్ సేవల వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన (APY), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) వంటి సామాజిక భద్రత పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
అలాగే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాల్లో కేవైసీ (KYC) అప్డేట్ చేయని ఖాతాదారులకు వెంటనే రీ-కేవైసీ పూర్తి చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త బ్యాంకు ఖాతాలు తెరవడానికి సీఎస్పీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువయ్యేలా సీఎఫ్ఎల్లు, సీఎస్పీలు సమిష్టిగా పనిచేసి ఆర్థిక చేర్పును మరింత బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, కొత్తగూడెం ఆర్బీఓ ఎఫ్ఐ మేనేజర్ భాను పద్మశ్రీ, పీ పాయింట్ జిల్లా మేనేజర్ భానోత్ కిషోర్, సిఎఫ్ఎల్ సి సి, నాగేందర్, పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సీఎస్పీ, సిఎఫ్ఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

‘ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి’