జూలూరుపాడు, జూన్ 01 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా పెండ్యాల విజయభాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని సోమవారం అందుకున్నారు. మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ధారా రామనరసింహం ప్రోత్సాహంతో మహాసభలో సభ్యత్వం పొందిన విజయభాస్కర్ సంఘంలో తనదైన ముద్ర వేశారు. ఆర్యవైశ్య యువజన సంఘం మండల స్థాయి బాధ్యత నుండి అంచలంచెలుగా ఎదుగుతూ జిల్లా యువజన సంఘం కార్యనిర్వహక అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, తదనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విశేష సేవలందించారు. ఆ తర్వాత మండల ఆర్యవైశ్య మహాసభలో పలు కీలక పదవులు నిర్వహించారు.
తనకున్న అపార అనుభవంతో జిల్లా ఆర్యవైశ్య మహాసభలోనూ ఆయన చురుకైన పాత్ర పోషించారు. సుజాతనగర్ నియోజకవర్గ కన్వీనర్గా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లాల విభజన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభకు తొలి కన్వీనర్గా, ప్రధాన కార్యదర్శిగా సేవలందించి.. ప్రస్తుతం జిల్లా గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గడిచిన మూడు సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ కార్యవర్గంలో సభ్యుడిగా పనిచేశారు. జిల్లాలో గత నాలుగు పర్యాయాలుగా జరిగిన అధ్యక్షుల ఎన్నికల్లో కీలకపాత్ర పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, పలువురి మన్ననలను పొందారు.