కొత్తగూడెం అర్బన్, జూన్ 11 : మధ్య భారతంలోని అమాయక ఆదివాసీ గిరిజనులపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా యుద్ధం ప్రకటించి హత్యాకాండకు పాల్పడుతున్నారని, ఈ చర్యలను దేశ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు, సీపీఎం జిల్లా నాయకుడు రేపాకుల శ్రీనివాస్, టీజేఎస్ జిల్లా నాయకుడు మల్లెల రామనాధం, మాస్లైన్ జిల్లా నాయకుడు జాటోత్ కృష్ణ, కాంగ్రెస్ నాయకుడు గౌస్ పాషా, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు అనుదీప్, బీఎస్పీ జిల్లా నాయకుడు కురుమళ్ల శంకర్, టీపీఎఫ్ జిల్లా నాయకుడు ప్రశాంత్ పిలుపునిచ్చారు. బుధవారం ‘శేషగిరిభవన్’లో వామపక్ష, విపక్షాల ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో నాయకులు మాట్లాడారు.
భారత రాజ్యాంగాన్ని, ఆదివాసీ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉల్లంగించి ‘ఆపరేషన్ కగార్’ పేరుతో దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని, అమాయక ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకుంటోందని ఆరోపించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉంచాల్సిన సైనికులను ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టులపైకి ఉసిగొల్పుతూ హత్యలకు ప్రేరేపిస్తోదని విమర్శించారు. 2026 నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని అమిత్ షా ప్రకటించడాన్ని దేశ ప్రజలు స్వాగతించడం లేదన్నారు. పేదరిక నిర్మూలన, పూర్తి స్థాయిలో విద్య, వైద్యం, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని బాధ్యతగా కేంద్ర పాలకులు ప్రకటిస్తే ప్రజలు స్వాగతిస్తారన్నారు.
అటవీ ప్రాంతంలో ఖనిజ సంపదకు కాపలాదారులుగా ఉన్న గిరిజనులను, మావోయిస్టులను మట్టుబెట్టి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ‘ఆపరేషన్ కగార్’కు కేంద్రం తెరలేపిందని ఆరోపించారు. తక్షణమే ‘ఆపరేషన్ కగార్’ పేరుతో జరుపుతున్న హత్యాకాండకు స్వస్తి చెప్పి శాంతి చర్చలను కేంద్రం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, వంగ వెంకట్, భూక్యా శ్రీనివాస్, కె రత్నకుమారి, ఫహీమ్, కె ఉమర్, కల్తీ వెంకటేశ్వర్లు, సతీష్, గోపాల్ రావు, దేవదానం, భూక్యా రమేశ్, కృష్ణయ్య, సంజీవ్, నాగమణి పాల్గొన్నారు.
Kothagudem Urban : ‘ఆపరేషన్ కగార్ను నిలిపివేసి తక్షణమే శాంతి చర్చలు జరుపాలి’
Kothagudem Urban : ‘ఆపరేషన్ కగార్ను నిలిపివేసి తక్షణమే శాంతి చర్చలు జరుపాలి’