– భద్రాద్రి కొత్తగూడెం ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జగదీష్
రుద్రంపూర్, మే 16 : ప్రతి అర్హుడికి సకాలంలో పరీక్షలు, మందులు, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జగదీష్ సిబ్బందిని ఆదేశించారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో శనివారం పలు కీలక ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించారు. హెల్త్ సెంటర్ పరిధిలో కొనసాగుతున్న అంటువ్యాధులు కాని వ్యాధుల (ఎన్సీడీ) నియంత్రణ కార్యక్రమాలను జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జగదీష్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు. అనంతరం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఎన్సీడీ స్క్రీనింగ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కేంద్రంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, స్క్రీనింగ్ కార్యక్రమాల పురోగతిపై ఆరా తీశారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ శాతం, బాధితుల సంఖ్య, వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో దోమల నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు ఉండకుండా చూడాలని, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎన్సీడీ పీఓ డాక్టర్ దినేష్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వి. హరికిషన్, పీహెచ్ఎం శ్రీనివాసరావు, నర్సింగ్ ఆఫీసర్ శంకరమ్మ, ఫార్మసిస్ట్ దిలీప్, ల్యాబ్ టెక్నీషియన్ ఎం.స్పందన, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

‘ఆరోగ్య పరిరక్షణలో ఎన్సీడీ స్క్రీనింగ్ కీలక పాత్ర’