కొత్తగూడెం: రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్ హజరయ్యారు. ఇందిరాపార్క్ వద్దకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో వారు కలసి వెళ్లారు. రైతులతో కలసి ధర్నాలో నిరసన తెలిపారు.కేంద్రం మొండి వైఖరి నశించాలి అని రైతులు పెద్ద ఎత్తున నినదించారు.
వడ్లు కొనకపోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతులను ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదని, ఎట్టి పరిస్థితుల్లో యాసంగి ధాన్యం కొనాల్సిందేనని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రైతాంగం పై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా రైతుల పక్షాన ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేస్తుందని అన్నారు. ప్రధాన మంత్రి వడ్లు కొనుగోలుపై రైతులకు స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్యే వనమాతో పాటు కొత్తగూడెం నుంచి వచ్చిన రైతులు నినదించారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.