మణుగూరు : ఏరియా బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యానికి 98.90లక్షల టన్నులకు గాను 88.52లక్షల టన్నులు 90శాతం ఉత్పత్తి సాధించిందని, ఓబీ వెలికితీతలో 109 శాతం సాధించి కంపెనీ వ్యాప్తంగా మణుగూరు ముందు స్థానంలో నిలిచిందని ఏరియా జీఎం జక్కం రమేశ్ అన్నారు. జీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. నిర్ధేశించిన లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఓసీ, పీకేఓసీ గనుల అధికారులను, ఉద్యోగులను, కార్మిక నేతలను ప్రత్యేకంగా అభినందించారు. కొండాపురం గనిలో ఉత్పత్తి పెంచేందుకు అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
మణుగూరు ఓసీ లక్ష్యాన్నిపెంచేందుకు పర్యావరణ అధికారులకు అనుమతులకు దరఖాస్తు చేశామని అవి త్వరలో రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రోడ్డు, రైలు, రోప్ల ద్వారా 89.25లక్షల టన్నులు తరలించామన్నారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందని కొత్త ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వస్తున్నదన్న నేపథ్యంలో ఏరియాలో విధిగా కరోనా నిబంధనలు పాటించాలని, ఈ మేరకు గనుల్లో విస్తృతంగా ప్రచారం చేసి పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
సోలార్ ద్వారా నవంబర్ మాసంలో 2.83లక్షల యూనిట్లు ఉత్పత్తి జరిగిందని అధికారులు ఫిడ్జరాల్డ్, నర్సిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. జియోథర్మల్ త్వరితగతిన పూర్తి చేయాలని సీఅండ్ఎండీ శ్రీధర్ ఆదేశించారని, ఈ మేరకు ఢిల్లీ శ్రీరాం ఇనిస్టిట్యూట్కి తగిన సహాయ సహకారాలు అందిస్తున్నామని షెడ్డు పనులు చివరికి చేరాయని, సింగరేణికి కేటాయించిన పనులు పూర్తి కావచ్చాయని తెలిపారు.
బొగ్గు లోడింగ్ పెంచుతాం…
ఏరియా నుంచి బొగ్గు లారీలకు లోడింగ్ పెంచుతామని బీటీపీఎస్, రోప్వే, కేంద్ర ఆదేశాల మేరకు విద్యుత్ ప్లాంట్లకు పంపాల్సిరావడంతో బొగ్గు లారీలకు లోడింగ్లో సమస్య ఏర్పడిందని డిసెంబర్ నుంచి ప్రస్తుతం ఇస్తున్న లోడింగ్కు రెట్టింపు చేసి లారీలకు లోడింగ్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. పీకేఓసీలో క్యాంటీన్ ఏర్పాటు చేసి కార్మికులకు రూ.30లకే భోజనం అందిస్తున్నామన్నారు. సీఎస్ఆర్ నిధుల కింద రూ.40లక్షలు మంజూరవగా, కొండాయిగూడెంలో శ్రీరస్తు సింగరేణి కళాభవన్ పేరిట భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ఈ సమావేశంలో అధికారులు నాగేశ్వరరావు, లక్ష్మీపతిగౌడ్, సలగల రమేశ్, వెంకటరమణ, ఫిడ్జరాల్డ్, నర్సిరెడ్డి, శ్రీనివాసచారి, నాగరాజు, సింగు శ్రీనివాస్, షబ్బీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.