ఇల్లెందు, మార్చి 19 : కోయగూడెం ఓసీ 2, ఫిట్ -2, 3లో సాగు భూములు కోల్పోయిన గిరిజన నిర్వాసితులకు హైకోర్టు తీర్పు ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ భూ నిర్వాసితుల సంఘం బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన, ధర్నా నిర్వహించింది. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధక్ష, కార్యదర్శులు మచ్చ వెంకటేశ్వర్లు, రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను ఉల్లంఘించి భూసేకరణ చేయడం వల్ల నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
2008 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టాన్ని, ప్రభుత్వం పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతిని ఉల్లంఘించి కోయగూడెం ఓసీ 2, ఫిట్ 2, 3 ప్రాజెక్ట్ కోసం 231.94 హెక్టార్ల పోడు సాగు భూములను టేకులపల్లి మండలం లచ్చగూడెం, కోయగూడెం, దంతెలతండా, కొత్తతండా, జేత్యతండా గ్రామాల గిరిజనుల నుంచి బలవంతంగా గుంజుకున్నారని తెలిపారు. న్యాయం కోసం నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. 2011లో హైకోర్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించింది. దీంతో జిల్లా రెవెన్యూ, సింగరేణి అధికారులు పునరావాస ప్యాకేజీ నామమాత్రంగా అమలు చేసి భూమికి నష్ట పరిహారం అసలు ఇవ్వలేదన్నారు.
భూమి నష్ట పరిహారం కోసం నిర్వాసితులు మళ్లీ కేసు వేయగా హైకోర్టు నిర్వాసితులకు నాలుగు వారాల్లో న్యాయం చేయాలని ఆదేశించిందన్నారు. అయినా నేటికి నష్ట పరిహారం అందలేదన్నారు. వెంటనే హైకోర్టు తీర్పు అమలు చేసి భూమి నష్ట పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఈసం నరసింహారావు, పూనెం స్వామి, పూనెం చంద్రశేఖర్, దొడ్డ సంపత్ కుమార్, దొడ్డ కోటేశ్వరరావు, చీమల క్రిష్ణ, బానోత్ వస్రాం, నరేశ్, లక్ష్మి, ఈసం చుక్కమ్మ పాల్గొన్నారు.
Koyagudem : కేఓసీ భూ నిర్వాసితులకు హైకోర్టు తీర్పు ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలి : మచ్చ వెంకటేశ్వర్లు