భద్రాచలం, డిసెంబర్ 16: భద్రాద్రి దివ్యక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం ధనుర్మాసోత్సవాలను వైభవంగా ప్రారంభించారు. సాయంత్ర 6:12 నిమిషాలకు ధనుసంక్రమణం ప్రవేశించడంతో సాయంత్రం 5 గంటలకే పవిత్ర గోదావరి నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తీర్థపు బిందెను తీసుకొని వచ్చారు. మూలవరులను, ఉత్సవ మూర్తులను, ఆండాళ్ అమ్మవారిని, లక్ష్మీ తాయారు అమ్మవారిని ప్రత్యేకంగా అభిషేకించారు. అంతరాలయంలో కృష్టోత్తర శత నామార్చన, ఆండాళ్ అష్టోత్తర శత నామార్చన నిర్వహించి ద్రావిడ మార్గళి 30 పాశురాలను పఠించారు. శనివారం నుంచి ఉదయం 5 గంటలకు ఆండాళ్ తల్లిని, కణ్ణన్ పరమాత్మను బేడా మండపానికి తీసుకొని వచ్చి తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. అనంతరం ఆండాళ్ తల్లికి తిరువీధి సేవ జరుపుతారు.