దమ్మపేట, జూలై 02 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్వీకరించారని అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. చర్చ కోసం తెలంగాణ భవన్లో ఎదురు చూస్తుండగా, చివరి నిమిషంలో మంత్రి జూపల్లి కృష్ణారావు వేదికను గన్పార్క్కు మార్చడం ఆశ్చర్యకరమన్నారు. గన్పార్క్కు బయల్దేరిన హరీష్ రావుని, బీఆర్ఎస్ నాయకులను తెలంగాణ భవన్ వెలుపలే భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకుని, తోపులాటల మధ్య హరీష్ రావును అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తాటి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజాస్వామ్య విలువలను పక్కనపెట్టి, పోలీసుల ద్వారానే పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడం, అరెస్టులకు పాల్పడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఒకవైపు చర్చకు సిద్ధమని ప్రకటించి, మరోవైపు చర్చకు వస్తున్న ప్రతిపక్ష నాయకులను పోలీసులతో అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. అవినీతి జరగకపోతే, విద్యాశాఖలో ఎలాంటి స్కామ్ లేకపోతే, రాష్ట్ర అప్పుల లెక్కలు సక్రమంగా ఉంటే చర్చకు రావడానికి భయం ఎందుకని ప్రశ్నించారు. చర్చలకు సిద్ధంగా ఉన్న హరీష్ రావు మంత్రులకు ఫోన్ చేసినా స్పందించకుండా, చర్చలు జరగకుండా పోలీసులను ఉపయోగించి అరెస్టు చేయించడం కాంగ్రెస్ పార్టీ పిరికితనాన్ని బయట పెడుతోందన్నారు.
ప్రజల ముందు నిజాలు వెలుగులోకి రాకుండా అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా బీఆర్ఎస్ పార్టీ వెనక్కి తగ్గదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని తాటి వెంకటేశ్వర్లు సవాల్ విసిరారు. ప్రజలు అన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో అణచి వేయాలని చూసినా ప్రజల తరఫున నిజాలను వెలుగులోకి తీసుకురావడంలో తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.