బూర్గంపహాడ్, ఏప్రిల్ 21 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో 14వ వేతన ఒప్పంద జాప్యానికి సంబంధించి వరంగల్కు చెందిన జాయింట్ లేబర్ కమీషనర్ (జేసీఎల్) వివరణ కోరినట్లు ఐఎన్టీయూసీ మిత్రపక్షాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి మంగళవారం తెలిపారు. ఈ నెల 13న వరంగల్ జాయింట్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఐటీసీ వేతన ఒప్పంద జాప్యం, కార్మిక సమస్యలకు సంబంధించి వినతిపత్రం అందజేశామని, దీనికి సంబంధించి జేసీఎల్ ఐటీసీ యాజమాన్యాన్ని ఈ సమస్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఓ పత్రాన్ని ఐఎన్టీయూసీ ద్వారా అందించడం జరిగిందన్నారు. ఐటీసీ యాజమాన్యం, గుర్తింపు సంఘం నిర్లక్ష్య ధోరణితో కార్మికుల హక్కులకు భంగం కలుగుతున్నందున జేసీఎల్ జోక్యం చేసుకుని యాజమాన్యాన్ని వివరణ కోరినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్మిక సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని వారు పేర్కొన్నారు.