– కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ దీక్షలకు స్పందించిన లేబర్ కమిషన్
బూర్గంపహాడ్, ఏప్రిల్ 17 : కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని మండుటెండను సైతం లెక్కచేయకుండా 23 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు వరంగల్ లేబర్ జాయింట్ కమిషనర్ స్పందించినట్లు జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్పాషా, బల్లెం నాగయ్య అన్నారు. శుక్రవారం రిలే దీక్షలకు సంబంధించి కార్మిక సమస్యలపై ఐటీసీ యాజమాన్యం వారంలోగా స్పష్టత ఇవ్వాలని యాజమాన్యాన్ని లేబర్ కమిషన్ ఆదేశించినట్లు తెలిపారు. 23వ దీక్షలో మర్రి వెంకటరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, మేకల సందీప్, జంగిలి శ్రీను పాల్గొనగా వారికి ఐటీసీ ఐఎన్టీయూసీ నాయకులు రెబ్బలపల్లి హరికృష్ణ, జేఏసీ కో కన్వీనర్ ఆకిని సర్వేశ్వరరావు, ఆకిని చందర్రావు, సూరిశెట్టి జగదీష్, బాదం సంతోశ్రెడ్డి పూలమాల వేసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఐటీసీ యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని పలుమార్లు లేబర్ జాయింట్ కమిషనర్కు జేఏసీ బాధ్యులం వినతిపత్రాలు ఇవ్వగా ఎట్టకేలకు స్పందించి వారం రోజుల్లో యాజమాన్యం కార్మిక సమస్యలపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించారన్నారు. కార్మిక సమస్యలను ఇప్పటికైనా యాజమాన్యం పరిష్కరించకపోతే సమ్మెకు వెళతామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.