– 9వ రోజుకు చేరిన కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ రిలే దీక్షలు
బూర్గంపహాడ్, ఏప్రిల్ 03 : కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన కోర్కెలను ఐటీసీ యాజమాన్యం తీర్చాలని, డిమాండ్లు సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, ఎండీ యాకూబ్పాషా డిమాండ్ చేశారు. శుక్రవారం రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకోవడంతో దీక్షల్లో తేజావత్ నరేశ్, కట్టా విశ్వేశ్వరరావు, నర్సింహారావు, ఆంబోతు సురేశ్, కుందూరు వెంకటేశ్వరరెడ్డి, కాటం పాపిరెడ్డి పాల్గొని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ 13వ వేతన ఒప్పంద కాలం గడువు పూర్తయి నాలుగు రోజులు కావస్తున్నా ఆ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, 14వ వేతన ఒప్పందాన్ని జేఏసీతో కలిసి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్మికుల సమస్యలపై ఐటీసీ యాజమాన్యం చొరవ చూపించాలని, చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు రామిశెట్టి లక్ష్మి, చుక్కపల్లి బాలాజీ, దాసరి ప్రశాంత్నాయుడు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.