– కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ
బూర్గంపహాడ్, ఏప్రిల్ 11 : కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐటీసీ యాజమాన్యం కనీసం గుర్తించడం లేదని, ఏదేమైనా రానున్న రోజుల్లో రిలే దీక్షలు కాస్తా సమ్మెగా మారతాయని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్పాషా హెచ్చరించారు. శనివారం 17వ రోజుకు చేరిన దీక్షా శిబిరంలో కార్మిక సంఘం జేఏసీ కో కన్వీనర్లు షేక్ యాకూబ్పాషా, బల్లెం నాగయ్య, ఆకిని సర్వేశ్వరరావు, సభ్యులు మర్రి వెంకటరెడ్డి, మహిళా కార్మికురాలు డి.మణి దీక్షల్లో పాల్గొని కాంట్రాక్టు కార్మికులకు మద్దతు పలికి వారి న్యాయమైన కోర్కెలు యాజమాన్యం తీర్చాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ.. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఐటీసీపై ఉందన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఐటీసీ కార్మికుల శ్రమను గుర్తించడం లేదని, రిలే దీక్షలు చేపట్టి 17 రోజులైనా ఐటీసీ యాజమాన్యం కార్మికుల శ్రమను గుర్తించడంలో మార్పు రాకపోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా కార్మిక సంఘ నాయకులను చర్చలకు పిలిచి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మెబాట తప్పదని హెచ్చరించారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యుడు సుంకిరెడ్డి వెంకటరెడ్డి, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.