– గ్రీవెన్స్ డే లో అధికారులకు సీపీఎం వినతి
జూలూరుపాడు, ఆగస్టు 31 : జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని, అలాగే పడమటి నర్సాపురంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో మండల అధికారులకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి యాస నరేశ్ మాట్లాడుతూ.. గత నెలలో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానతో పాటు పడమటి నర్సాపురంలోని గిరిజన బాలికల ఆశ్రమ వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే జూలూరుపాడులో 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణం చేపట్టినా, నేటికీ అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యం 150 నుంచి 200 మంది వరకు ఓపీ నమోదవుతున్న ప్రస్తుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సరిపడా వైద్యులు, సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.పడమటి నర్సాపురం బాలికల హాస్టల్లో వర్షం వస్తే కనీస వసతులు లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారని, పరిసరాల నుంచి విషసర్పాలు వస్తుండటంతో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం హాస్టల్కు తక్షణమే జనరేటర్ సౌకర్యం కల్పించాలని, విద్యార్థినులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు గార్లపాటి వెంకటి, ఓడల వెంకటేశ్వర్లు, బోడ అభిమిత్ర, గడిదేసి కనకరత్నం పాల్గొన్నారు.