– 130 మందికి పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ
జూలూరుపాడు, జూన్ 06 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో మాస్టర్ ఈకే శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సుమారు 130 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి హోమియో మందులను ఉచితంగా పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా హోమియో వైద్యులు జి. రాధాకృష్ణమూర్తి, టి. రవికాంత్ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.
అనవసరంగా అధికంగా మందుల వినియోగం చేయకుండా, సరైన జీవన విధానాన్ని అవలంబించడంతో పాటు హోమియో వైద్యం ద్వారా అనేక వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చని వివరించారు. అనంతరం గ్రామస్తులకు హోమియో వైద్య విధానం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఖాదరేంద్రబాబు, కె. శ్రీనివాసరెడ్డి, పి.ఎస్.ఎస్. మూర్తి, పి. శ్రీధరరావు, టి. ధనలక్ష్మి, కోటేశ్వరరావు, కరుణ, వీరమల్లు, సీహెచ్. శ్రీమన్నారాయణతో పాటు గ్రామస్తులు రాచబంటి వెంకట నరసయ్య, కళ్యాణం వెంకటప్పయ్య, గోగుల వెంకటేశ్వర్లు, సున్నం ప్రసాద్ పాల్గొన్నారు.

కాకర్లలో హోమియో వైద్య శిబిరం